ఏపీ ఆటో డ్రైవర్లకు దసరా కానుక – వాహనమిత్ర కింద రూ.15,000 సాయం | Ap Auto Drivers Vahanamitra 15000 Dasara Benefit
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద ప్రతి ఏటా ₹15,000 ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది దసరా రోజునే డ్రైవర్ల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ₹15,000 జమ చేస్తామని తెలిపారు. అదనంగా, ₹2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు ప్రకటించారు.
ఇటీవలి కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న స్త్రీశక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిన విషయం తెలిసిందే. దీంతో జీవనోపాధి కష్టంగా మారిందని ఆటో డ్రైవర్లు పలు సందర్భాల్లో వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ఆర్థిక ఊరట ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి, ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకు సాయం అందిస్తామని అప్పటికే సంకేతాలు ఇచ్చినా, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడింది. తాజా సభలో సీఎం చంద్రబాబు దసరా నాటికి వాహనమిత్ర పథకాన్ని అధికారికంగా ప్రారంభించి, రూ.15,000 సాయం అందిస్తామని మరోసారి ధృవీకరించారు.
ఇక స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సు పథకం బలంగా కొనసాగుతుందని, దీనివల్ల మహిళలకు పెద్ద సహాయం జరుగుతోందని చెప్పారు. అదే సమయంలో, ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి వాహనమిత్ర కింద సాయం అందించడం ద్వారా రెండు వర్గాలకూ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.